: అయ్యో అయ్యో అయ్యయ్యో... ఓ రాయి వెయ్యండి, పడతానో లేదో తెలుస్తుంది!: యాంకర్ అనసూయతో విక్టరీ వెంకటేశ్

"అయ్యో అయ్యో అయ్యయ్యో... ఓ రాయి వెయ్యండి, పడతానో లేదో మీకు తెలుస్తుంది... నాకు తెలియదు" అని విక్టరీ వెంకటేశ్ వ్యాఖ్యానించాడు. ఓ టీవీ చానల్ నిర్వహిస్తున్న 'ఏ డేట్ విత్ అనసూయ' కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వెంకటేశ్, యాంకర్ అనసూయతో పలు విషయాలపై ముచ్చటించాడు. తనతో డేటింగ్ తరువాత ప్రేమలో పడే అవకాశముందా? అని ప్రశ్నించగా, తన తాజా చిత్రం 'బాబు బంగారం'లోని డైలాగుతో వెంకటేశ్ ఈ సరదా వ్యాఖ్య చేశాడు. ప్రస్తుతం 'బాబు బంగారం' ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుందని, ఈ విషయాన్ని తాము ముందుగానే ఊహించామని తెలిపాడు. ఏదైనా హారర్ సినిమాలో చేయాలన్న కోరిక తనకుందని, సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని వివరించాడు. గతంలో తిరుపతిలో షూటింగ్ చేస్తున్న వేళ, ఓ అభిమాని వచ్చి, హీరోలకు ఏడవడం చేతకాదని, తలకు చేతిని అడ్డుపెట్టుకుని, గోడ దగ్గరకు వెళ్లిపోతారని అనగా, దాన్ని ఎంతో చాలెంజ్ గా తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. దాని ప్రభావంతోనే 'ధర్మచక్రం' చిత్రంలో హీరోయిన్ మరణించే సన్నివేశం, 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల్లోని కొన్ని సీన్లు బాగా వచ్చాయని, ఎమోషనల్ సీన్లలో ఎప్పుడు నటించాల్సి వచ్చినా, ఆ అభిమాని గుర్తుకు వస్తాడని వెంకీ తెలిపాడు.

More Telugu News