: సాగర్ కు కొనసాగుతున్న స్వల్ప వరద... కృష్ణా ప్రాజెక్టుల్లో నీటి వివరాలు

కృష్ణానదికి స్వల్ప వరద కొనసాగుతోంది. జూరాల, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాల నుంచి వస్తున్న నీరు తగ్గడంతో ఈ ఉదయం 10 గంటలకు శ్రీశైలం రిజర్వాయర్ కు వస్తున్న నీటి వరద 16 వేల క్యూసెక్కులుగా నమోదైంది. ఇక్కడి నుంచి 26,456 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 873 అడుగుల వరకూ నీరుంది. మొత్తం 154.52 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు 19,931 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 22,369 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ లో 139.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే, జూరాలకు 15,195 క్యూసెక్కులు, తుంగభద్రకు 9,578 క్యూసెక్కులు, నారాయణపూర్ కు 23,251 క్యూసెక్కులు, ఆల్మట్టికి 25,420 క్యూసెక్కుల నీరు వస్తుండగా, దాదాపు అంతే మొత్తాన్ని కిందకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తి స్థాయి నీటిమట్టంతో కళకళలాడుతున్నాయి.

More Telugu News