: ఆనందాన్ని వర్ణించలేను... మేఘాల్లో తేలిపోతున్నట్టుంది: సింధు

బ్యాడ్మింటన్ వరల్డ్ నంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయినా, భారత ఖ్యాతిని సగర్వంగా చాటిన తెలుగుతేజం పీవీ సింధు, తనకిప్పుడు గాల్లో తేలినట్టుందని వ్యాఖ్యానించింది. "ఆటల పోటీలు ప్రారంభమైన వేళ, నాకు పతకం వస్తుందని, ఇంత దూరం ప్రయాణిస్తానని ఊహించలేదు. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేను, మేఘాల్లో విహరిస్తున్నట్టు అనిపిస్తోంది" అని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. 21 సంవత్సరాల సింధూ, ఫైనల్ లో స్పెయిన్ క్రీడాకారిణిపై పోరాడి ఓటమి పాలైనప్పటికీ, రజత పతకాన్ని గెలుచుకుని, 130 కోట్ల మంది భారతీయుల అభిమానాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఇంతవరకూ ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం గెలుచుకున్న భారత మహిళా క్రీడాకారిణులు నలుగురు ఉండగా, సింధు ఐదవ మహిళగా చేరింది. కరణం మల్లీశ్వరి, మేరీ కోం, సైనా నెహ్వాల్ లు గత ఒలింపిక్స్ లో, సింధు పతకం సాధించడానికి కొన్ని గంటల ముందు సాక్షీ మాలిక్ పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News