: వైఎస్ ఆత్మ కేసీఆర్ ను ఆవహించింది: రేవంత్ రెడ్డి

గతంలో జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ ప్రస్తుతం సీఎం కేసీఆర్ ను ఆవహించిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్వహించిన జలయజ్ఞం.. ధనయజ్ఞమని రుజువు చేశామన్నారు. అలాగే వైఎస్ ఆత్మ కేసీఆర్ లో ప్రవేశించడం వల్లే తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరిట కేసీఆర్ ధనయజ్ఞం చేస్తున్నారని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టుల సమయంలో కేసీఆర్, హరీశ్ రావులు కాంగ్రెస్ తో అధికారం పంచుకున్నారని, ఆ ప్రాజెక్టులకు నాడు కేబినెట్ మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఆమోదం తెలిపారని విమర్శించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తో కలిసి తిరుగుతుంటే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం తాము పోరాడుతున్నామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత ఇటీవల టీఆర్ఎస్ లో చేరినా ఆ పార్టీ ఇంతవరకు ప్రశ్నించలేదంటే వారి పోరాటం ఏపాటిదో తెలుస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు.

More Telugu News