: డోపింగ్ ఫలితం.. రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై నాలుగేళ్ల నిషేధం

డోపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత ఫ్ర‌ీస్టైల్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్) నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అతడు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాడు. నిజానికి ఈ రోజు (శుక్రవారం) 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ బరిలోకి దిగాల్సి ఉంది. అంతలోనే డోపింగ్‌ కేసులో అతనిని దోషిగా తేల్చి నాలుగేళ్ల నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తున్నట్టు కాస్ పేర్కొంది. దీంతో రియోలోని క్రీడా గ్రామంలో తనకు కేటాయించిన గదిని నర్సింగ్ ఖాళీ చేయాల్సి ఉంది. భారత అధికారులు అతడిని మరో చోటుకి తరలించాలని అక్కడి నుంచి భారత్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నర్సింగ్‌కు క్లియరెన్స్ ఇచ్చినా కాస్ దానిని పరిగణనలోకి తీసుకోకుండా నిషేధం విధించడం దురదృష్టకరమని భారత అధికారులు పేర్కొన్నారు. కాస్ తీరుపై వరల్డ్ రెజ్లింగ్ బాడీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రియో గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీకి లేఖ రాయనున్నట్టు తెలిపారు. వారందరూ నర్సింగ్‌కు లైన్ క్లియర్ చేయడంతోనే అతడు రియో చేరుకున్నాడని క్రీడాకారులతోపాటు వెళ్లిన అధికారి గుప్తా పేర్కొన్నారు. ఇది చాలా అన్యాయమని, కాస్ తీర్పుతో అతడి క్రీడా జీవితం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News