: కశ్మీర్‌లో చొరబడిన 60 మంది ఉగ్రవాదులు.. ఐదుగురు హతం

హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో చెలరేగిన అల్లర్లను అవకాశంగా తీసుకుని పాక్ నుంచి 60 మంది ఉగ్రవాదులు భారత్‌లో చొరబడ్డారు. కుప్వారా, యూరీ సెక్టార్ల నుంచి ఉగ్రవాదులు లోయలోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మారణాయుధాలతో చొరబడిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకున్నారు. వీరిలో కొందరు బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు బారాముల్లాలో సెక్యూరిటీ కాన్వాయ్‌పై దాడిచేశారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ దాడి తమపనేనని హిజ్బుల్ ప్రకటించింది. గత రెండు వారాల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి 60 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని, పాక్ ఆర్మీ వీరికి సహకరించిందని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు. వారికి భారీగా మందుగుండు, మారణాయుధాలు అందించి పంపినట్టు పేర్కొన్నారు. చొరబాటుదార్లలో ఐదుగురిని మట్టుబెట్టినట్టు ఆయన తెలిపారు. కాగా లోయలో బుధవారం కూడా కర్ఫ్యూ కొనసాగింది.

More Telugu News