: వైసీపీకి మంచి రోజులొచ్చాయట!... తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే చేరిక సందర్భంగా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్య

ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంచి రోజులొచ్చాయట. గడచిన ఎన్నికల్లో అందినట్టే అందిన అధికారం... ఆ పార్టీకి అందకుండానే పోయింది. చివరి నిమిషంలో టీడీపీకి ఆధిక్యం రావడంతో ఆ పార్టీకి అధికారం దక్కలేదు. అంతేకాకుండా తలచుకుంటే టీడీపీ సర్కారును గంటలో కూలుస్తానంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య... పార్టీని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేసింది. ఈ ఒక్క కామెంట్ ను ఆసరా చేసుకుని టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసింది. వెరసి వైసీపీ టికెట్లపై విజయం సాధించిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, పలువురు కీలక నేతలు టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో ఆ పార్టీ కేడర్ లో నిర్వేదం నెలకొంది. అయితే నిన్న టీడీపీ నేత, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అధికార పార్టీ నుంచి వైసీపీలోకి చేరిపోయారు. నిన్న హైదరాబాదులో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొట్టు సత్యనారాయణను పార్టీ నేతలకు స్వయంగా పరిచయం చేసిన జగన్... పార్టీకి మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇక నుంచి పార్టీ విజయపథంలో దూసుకుపోతుందని ఆయన ప్రకటించారు.

More Telugu News