: నయీమ్ తో సంబంధాలున్నాయంటూ ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు: టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్

ప్రస్తుత రాజకీయాల్లో నీతి, నియమాలు, విలువలు కలిగి, ప్రజలకు నిస్వార్థ చేస్తున్న రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గ్యాంగ్ స్టర్ నయీంతో చేతులు కలిపారంటూ, అతనితో సంబంధాలున్నాయంటూ, పలువురు రాజకీయ నాయకులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకుల పాత్రపై సిట్ నిగ్గు తేలుస్తుందని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు రాజకీయ నాయకులకు విలువలు లేవు అనేలా ప్రసారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందుకే వెబ్ సైట్లపై తాను ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. రాజకీయ నాయకులపై ఇష్టమొచ్చినట్టు కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా ఓ వార్తా పత్రికకు సంబంధించిన వెబ్ సైట్ రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టి మరీ కథనాలు రాస్తోందని, దానిపై చర్యలు తీసుకోవాలని తాము డీజీపీని కోరామని ఆయన చెప్పారు.

More Telugu News