: కేంద్ర మంత్రి వీకే సింగ్ భార్యను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి!... రూ.2 కోట్లు డిమాండ్ చేసిన వైనం!

ఇండియన్ ఆర్మీ మాజీ చీప్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కుటుంబానికి బ్లాక్ మెయిలింగ్ బెదిరింపులు ఎదురయ్యారు. వీకే సింగ్ సతీమణి భారతీ సింగ్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఏకంగా రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. వీకే సింగ్ ఇంటికి ఫోన్ చేసిన సదరు వ్యక్తి భారతీ సింగ్ తో మాట్లాడుతూ తనను తాను ఆమె స్నేహితురాలి బంధువు ప్రదీప్ చౌహాన్ గా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వత తనకు రూ.2 కోట్లు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. సదరు మొత్తాన్ని ఇవ్వని పక్షంలో వీకే సింగ్ కుటుంబ పరువును బజారుకీడుస్తానని అతడు బెదిరించాడట. కేంద్ర మంత్రి కుటుంబం పరువుకు భంగం కలిగించే ఆడియో, వీడియో టేపులను సోషల్ మీడియాలో పెడతానంటూ అతడు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడట. ఈ బెదిరింపులకు ఏమాత్రం బెదరని భారతీ సింగ్ విషయాన్ని తన భర్తకు చెప్పడంతో పాటు నేరుగా ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం కేంద్ర మంత్రి కుటుంబానికి చెందిన వ్యవహారం కావడంతో వివరాల వెల్లడికి నిరాకరిస్తున్న పోలీసులు సదరు బ్లాక్ మెయిలర్ ను అరెస్ట్ చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించినట్లు సమాచారం.

More Telugu News