: కాశ్మీర్లో అల్లర్లు కొనసాగించేందుకు రూ. 24 కోట్లు పంపిన పాక్!

కాశ్మీర్ లోయలో నిరసనలు కొనసాగిస్తూ ఉండేందుకు ఆందోళనకారులకు పాకిస్థాన్ నుంచి పెద్ద మొత్తంలో నగదు అందుతోంది. గడచిన మూడు వారాల వ్యవధిలో దాదాపు రూ. 24 కోట్లకు పైగా సరిహద్దులు దాటి ఇండియాకు వచ్చిందని కాశ్మీర్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో పాక్ కు అనుకూలంగా ఉన్న సీనియర్, మధ్య తరహా నేతలకు ఈ డబ్బులు వచ్చాయని, వారి నుంచి కింది స్థాయి కార్యకర్తలకు డబ్బులు పంచి అశాంతిని కొనసాగిస్తున్నారని వివరించారు. జమాతే ఇస్లామీ, అసియా అంద్రాబీ నేతృత్వంలోని 'దుఖ్తానన్ ఏ మిల్లత్' తదితర సంస్థలకు ఈ నిధులు అందాయని తెలిపారు. ఈ డబ్బును అక్కడి యువతకు ఇస్తూ, భద్రతా దళాలపై దాడులు కొనసాగించాలని వేర్పాటు వాద నేతలు సూచిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, బుర్హాన్ వనీ హత్యానంతరం మొదలైన అల్లర్లలో ఇప్పటివరకూ 65 మంది మరణించారు. గత సాయంత్రం నుంచి మొదలైన తాజా ఘర్షణల్లో ఆరుగురు మృతి చెందారు. మూడు వారాల వ్యవధిలో 5 వేల మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎంతో మంది సైనికులు, పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు.

More Telugu News