: 3,000 మందిని తొలగిస్తామన్న వార్తలు అవాస్తవం: ఇన్ఫోసిస్

రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్లండ్‌ (ఆర్‌బీఎస్‌) సంస్థ ఇన్ఫోసిస్ తో చేసుకున్న 30 కోట్ల యూరోల (సుమారు 2500 కోట్ల రూపాయల) విలువ చేసే ఐదేళ్ల కాంట్రాక్టును రద్దు చేసుకోవడంతో, ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న 3,000 మంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయని, వారిని దశల వారీగా తొలగించనున్నారని వార్తలు వెలవడ్డ సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇన్ఫోసిస్ స్పందించింది. ఉద్యోగులపై వేటు లేదని స్పందించింది. ఆ ప్రాజెక్టు కోసం కేటాయించిన ఉద్యోగులను ఇతర ప్రాజెక్టుల వైపు మళ్లిస్తామని చెప్పింది. వినియోగదారులకు ఇప్పుడందిస్తున్న సేవలను మరింత మెరుగ్గా, వేగంగా అందించేందుకు వారు సహకరిస్తారని ఇన్ఫోసిస్ ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో మీడియాలో వెలువడిన వార్తలతో పతనం దిశగా సాగిన ఇన్ఫోసిస్ షేరు, ఈ ప్రకటనతో కోలుకుంది. షేరు ముగిసే నాటికి 1.2 శాతం నష్టంతో 1.050.95 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా, ఐటీ రంగం షేర్లన్నీ నేడు నష్టాల బాటలో నడవడం విశేషం.

More Telugu News