: ఒలింపిక్స్ స్థాయికి ఇంత తొందరగా ఎదుగుతుందని ఊహించలేదు: సింధు తల్లి

ఎనిమిదేళ్ల క్రితం సింధు ఇంతటి స్థాయికి వస్తుందని ఊహించలేదని పీవీ సింధు తల్లి తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, కెరీర్ ఆరంభం నుంచి గోపీచంద్ దగ్గరే సింధు ఉందని చెప్పారు. రోజూ తెల్లవారుజామునే 4 గంటలకు నిద్రలేచి ప్రాక్టీస్ మొదలు పెడుతుందని ఆమె చెప్పారు. రోజూ ఏడు గంటల చొప్పున ప్రాక్టీస్ చేసిన రోజున కూడా ఎప్పుడూ నొప్పులుపుడుతున్నాయని ఫిర్యాదు చేయలేదని ఆమె అన్నారు. అసలు దేనికీ ఫిర్యాదు చేయదని, బాగా సర్దుకుపోతుందని, ఎవరిపైనైనా కోపం వచ్చినా, వారితో గొడవ పెట్టుకోదని, వారిని కూడా కలుపుకుంటుందని ఆమె చెప్పారు. చుట్టాలందరితో బాగా కలిసిపోతుందని ఆమె అన్నారు. అందరిలాగే తాను కూడా ఒలింపిక్స్ లో పతకం తేవాలనే కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. సింధు ఎంత సాధించినా ఇంకా సాధించాలనే కోరుతానని, ఆశకు అంతేముంది చెప్పండి? అంటూ ఆమె నవ్వుతూ అన్నారు. పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులు ఆనందిస్తారని, సింధు విషయంలో తాను కూడా తల్లినేనని, తాను ఏం చేసినా తనకు ఇష్టమేనని ఆమె చెప్పారు.

More Telugu News