: 14 సెకన్ల పాటు అమ్మాయిని చూస్తే వేధించినట్టే... కేరళ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యలపై కలకలం

"ఓ అమ్మాయిని 14 సెకన్ల పాటు తదేకంగా చూస్తే, ఆమెను మానసికంగా వేధించినట్టే. దీనిపై కేసు నమోదు చేస్తాం" అని కేరళ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్న రిషీ రాజ్ సింగ్ వ్యాఖ్యానించడాన్ని ఆ రాష్ట్ర మంత్రులు తప్పుబడుతున్నారు. కొచ్చిలో విద్యార్థులతో సమావేశమైన ఆయన, ప్రసంగిస్తూ, ఎవరైనా ఓ వ్యక్తి ఓ యువతి వైపు 14 సెకన్ల పాటు చూస్తే, కేసు రిజిస్టర్ చేయవచ్చని, అమ్మాయిలు కత్తి లేదా పెప్పర్ స్ప్రేను తమ హ్యాండ్ బ్యాగుల్లో నిత్యమూ ఉంచుకోవాలని ఆయన చెప్పారు. ఇలా వేధింపులకు కొత్త అర్థం చెప్పిన రిషి రాజ్ సింగ్ వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని కేరళ క్రీడా శాఖ మంత్రి ఈపీ జయరాజన్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఎదుట ఆయన చేసిన పూర్తి ప్రసంగాన్ని పరిశీలించాలని ఎక్సైజ్ మంత్రిని కోరనున్నట్టు తెలిపారు. కాగా, ఇదే రాజ్ సింగ్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని, ఓ మంత్రికి సెల్యూట్ చేయలేదని ఆరోపిస్తూ, డిపార్ట్ మెంటల్ ఎంక్వయిరీకి యూడీఎఫ్ సర్కారు ఆదేశించిన సంగతి తెలిసిందే.

More Telugu News