: కోలుకున్నాను.. ప్రస్తుతం జిమ్‌కు వెళుతున్నాను: కమలహాసన్

తమిళనాడులో ఆళ్వార్ పేటలోని తన ఆఫీసులో మెట్లు ఎక్కుతూ జారిపడటంతో గాయ‌ప‌డిన సినీన‌టుడు కమలహాసన్ ఇటీవ‌లే ఆసుప‌త్రి నుంచి డిచ్చార్జ్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఆయ‌న ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. త‌న ఆరోగ్యాన్ని మ‌రింత మెరుగుప‌ర్చుకోవ‌డానికి ఇప్పుడు ఆయన జిమ్‌కు వెళుతున్నారు. ఈ విషయాన్ని క‌మ‌ల్ త‌న ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. త‌న కాలికి వైద్యులు కుట్లు విప్పారని ఆయన తెలిపారు. రెండు రోజులుగా తాను జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. త‌నకు ఫిజియో జరుగుతోంద‌ని తెలిపారు. త‌న ఆరోగ్యం బాగుప‌డాల‌ని ఆకాంక్షించిన త‌న‌ శ్రేయోభిలాషులందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తన మెసేజ్ ను ఓ వీడియో ద్వారానూ ఆయ‌న తెలిపారు. ‘నా పట్ల ఎంతో ప్రేమాభిమానులు క‌న‌బ‌రుస్తోన్న‌ అభిమానులు, మిత్రులు, కుటుంబసభ్యులు, ప‌త్రికా విలేక‌రుల‌కి ధ‌న్య‌వాదాలు. నేను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి స‌మ‌యంలో నాకు ప్రమాదం జరగడం దురదృష్టమే’ అన్నారు కమల్.

More Telugu News