: ఈ చేపలు 400 ఏళ్లు బతుకుతాయట!

400 ఏళ్లు జీవించే జలచరాలను పరిశోధకులు కనుగొన్నారు. నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించే గ్రీన్ ల్యాండ్ సొరచేపలు సుమారు 400 ఏళ్ల పాటు జీవిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ చేపలు సముద్రంలో అత్యంత నెమ్మదిగా కదులుతాయని, గంటకు కేవలం ఒక మైలు దూరాన్ని మాత్రమే ఇవి ప్రయాణిస్తాయని వారు తెలిపారు. ఏడాదికి కేవలం ఒక సెంటీ మీటర్ పరిమాణం మాత్రమే ఈ చేప పెరుగుతుందని, అలా 20 అడుగుల వరకు ఈ చేప పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొపెన్ హాగన్ పరిశోధకులు తెలిపారు. చేప పరిమాణాన్ని బట్టి దాని జీవిత కాలాన్ని అంచనా వేయగా, అది 400 ఏళ్లు బతుకుతుందని పరిశోధకులు గుర్తించారు. దీనిని నిర్ధారించుకునేందుకు 'బాంబ్ పల్స్' అనే పద్ధతిని కూడా ఈ చేపలపై ప్రయోగించినట్టు వారు తెలిపారు. ఈ పరీక్షలో వారు గుర్తించిన చేపలు 1950 కాలంలో అవి యుక్త వయసులో ఉన్నట్టు గుర్తించారు. వీటికి 156 ఏళ్ల వయసు వస్తే కానీ శృంగారంలో పాల్గొనవని వారు వెల్లడించారు. ఈ లెక్కన వారు పరిశోధించిన చేప 1624లో పుట్టిందని పేర్కొన్నారు. దీంతో 150 ఏళ్లు జీవించే తాబేలు, 200 ఏళ్లు జీవించే తిమింగలాల కంటే సుదీర్ఘ కాలం జీవించే జలచరాలు ఇవేనని వారు చెబుతున్నారు.

More Telugu News