: యూపీలో ప్రత్యర్థి పార్టీలపై అమిత్ షా ప్రశ్నల వర్షం

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా ఈరోజు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాకోరిలో ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డ‌ తిరంగా యాత్రను ఆయన ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ త‌మ ప్ర‌త్య‌ర్థి పార్టీలపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో సమాజ్వాది పార్టీ లేదా బహుజన సమాజ్ పార్టీ గెలుపొందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆ పార్టీల నేతలు నిరంతర విద్యుత్తు ఇస్తారా? అని అమిత్ షా ప్రశ్నించారు. బులంద్షహర్ గ్యాంగ్రేప్ ఘటన లాంటి అకృత్యాలకు తెర‌ప‌డుతుందా? అని దుయ్య‌బ‌ట్టారు. ఆ పార్టీలు ఎన్నిక‌ల్లో గెలుపొందితే స‌మాజంలోని ఒక వర్గం కోసమే పనిచేస్తాయని, త‌మ పార్టీ అన్ని వర్గాల కోసం పాటుప‌డుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించ్చారు. తాము సబ్ కా సాత్, సబ్ వికాస్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామ‌ని పేర్కొన్నారు. యూపీ అభివృద్ధిలో దూసుకుపోకపోతే దేశాభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.

More Telugu News