: నయీమ్ ఇంతలా ఎదుగుతుంటే పోలీసులు ఊరుకోవడం అభ్యంతరకరమే: మాజీ పోలీసు అధికారి డీటీ నాయక్

నయీమ్ మాజీ నక్సలైట్ స్థాయి నుంచి గ్యాంగ్ స్టర్ గా ఎదగడంలో పోలీసుల మౌనం అభ్యంతరకరమని మాజీ పోలీసు అధికారి డీటీ నాయక్ తెలిపారు. ఈ రోజు ఆయన ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, నయీమ్ ను తాను కనీసం చూడలేదని, అయితే ఒక దళం సభ్యుడని విన్నానని అన్నారు. సమాచారం ఉందంటే సమాజంలోని ప్రతిఒక్కరినీ తాము వినియోగించుకుంటామని ఆయన చెప్పారు. సమాచారం ఇచ్చారు కదా అని నేరాలు చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోవడం సరైన విధానం కాదని ఆయన తెలిపారు. వేల కోట్ల రూపాయల సంపాదన వరకు ఒక నేరగాడు ఎదిగాడంటే పోలీసుల వైఫల్యముందని ఆయన అంగీకరించారు. తనకు నయీమ్ తో సంబంధాలున్నాయంటూ వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని ఆయన తెలిపారు. తాను నార్త్ తెలంగాణలో పని చేశానని ఆయన చెప్పారు. తాను పనిచేసిన ఏరియాలో నయీమ్ వంటి వారి పాత్రలేదని, తనకు గ్యాంగ్ స్టర్స్ తో ఎలాంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సిద్ధాంతపరంగా నక్సలిజం వైపు ఆకర్షితులైన వారిపై తమ గురి ఉండేదని, ఇలాంటి సెటిల్ మెంట్లు చేసేవారు తమకు ఎదురుపడలేదని ఆయన తెలిపారు.

More Telugu News