: తాను సెలబ్రిటీనని గొంతు చించుకున్న యువతి... విమానం ఎక్కనివ్వని గో ఎయిర్!

తానో సెలబ్రిటీనని, గో ఎయిర్ గ్రౌండ్ స్టాఫ్ తనను పట్టించుకోవడం లేదని ముంబై విమానాశ్రయంలో అరిచి గగ్గోలు పెడుతున్న ఓ యువతిని విమానం ఎక్కించుకునేందుకు ససేమిరా అన్న ఫ్లయిట్ కమాండర్, మిగతా ప్రయాణికులను తీసుకుని విమానాన్ని టేకాఫ్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, లక్నోకు బయలుదేరాల్సిన గో ఎయిర్ ఫ్లయిట్ 387 బోర్డింగ్ కు సిద్ధమైన వేళ, సీమా అహూజా అనే యువతి ఎయిర్ లైన్స్ ఉద్యోగులపై కేకలు వేయడం ప్రారంభించింది. రెండు చేతుల్లో రెండు బ్యాగ్స్ తీసుకు వచ్చిన ఆమె, వాటిని విమానంలోకి చేర్చేందుకు సహాయకుడిని ఇవ్వాలని కోరడంతో గొడవ మొదలైనట్టు ఇతర ప్రయాణికులు తెలిపారు. తాను ఓ సెలబ్రిటీనని, గో ఎయిర్ ఉద్యోగులు తనను తూలనాడారని, సరిగ్గా చూసుకోలేదని ఆరోపిస్తూ, ఆమె పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టింది. బోర్డింగ్ కోసం వేచి చూస్తున్న వారు సైతం అవాక్కయ్యేలా మండిపడింది. ఆమె బ్యాగులను విమానంలోకి చేర్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పినా వినలేదు. దీంతో ఫ్లయిట్ కమాండర్ ఆమెను ఎక్కించుకునేందుకు అంగీకరించ లేదు. ఆపై ఉదయం 9:50కి విమానం టేకాఫ్ అయిపోయింది. ఘటనపై స్పందించిన గో ఎయిర్ ప్రతినిధి, కెప్టెన్ నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదని, ఆమెను తరువాతి విమానంలో పంపేందుకు యత్నిస్తున్నామని తెలిపారు.

More Telugu News