: గూడ్సు రైలులో ఆ చివర ఇక గార్డు కనిపించడు.. కొత్త వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే సన్నాహాలు

గూడ్సు రైలు అనగానే ముందుగా గుర్తొచ్చేది గార్డే. ముందెక్కడో డ్రైవర్ ఉంటే ఆ చివర ఎక్కడో గార్డు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఉంటాడు. గంటల తరబడి ఉన్నచోటునే ఉండిపోవడం, ఎక్కడ పడితే అక్కడ గూడ్సు రైళ్లను నిలిపివేయడంతో గార్డును చూసిన వారు అయ్యో అనకుండా ఉండలేరు. అయితే త్వరలో గార్డులను నియమించే పనికి రైల్వే స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. ఆ స్థానంలో సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బోగీలు విడిపోకుండా పూర్తిగా కలిపి ఉంచడంతోపాటు చివరి బోగీకి టెలీమెట్రీ పరికరాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. చివరి బోగీకి లోకోమోటివ్ ట్రాన్స్‌మిటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల అది డ్రైవర్‌కు సంకేతాలు అందిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు డ్రైవర్‌కు దాని నుంచి సంకేతాలు అందుతాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై దానిని సరిదిద్దుకునే అవకాశం ఉంది. అలా గార్డు నిర్వహించే మొత్తం పనిని ఈ పరికరమే నిర్వహిస్తుందన్న మాట. దీనిని కొనుగోలు చేసేందుకు రైల్వే రూ.వంద కోట్లు కేటాయించింది.

More Telugu News