: సరైన సమాధానం ఇచ్చే తీరుతా: బెయిల్ పై విడుదలైన దయాశంకర్ సింగ్

ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతిని వేశ్యగా అభివర్ణించి చిక్కులను కొనితెచ్చుకున్న మాజీ బీజేపీ నేత దయాశంకర్ సింగ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు నిన్న బెయిల్ ను మంజూరు చేయడంతో నేడు ఆయన బయటకు వచ్చారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, తన కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని, తనవారిని బెదిరించారని బీఎస్పీ నేతలపై విరుచుకుపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకున్న వారికి సరైన సమాధానం ఇచ్చే తీరుతానని తెలిపారు. కాగా, బీజేపీ కూడా దయాశంకర్ తీరును తప్పుబడుతూ, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మాయావతిపై అనుచిత విమర్శలు చేసిన తరువాత, 10 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోయిన దయాశంకర్ ను గత నెల 29న బీహార్ లోని బుక్సర్ పట్టణంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై న్యాయమూర్తి రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించగా, జైలుకెళ్లిన ఆయన బెయిల్ పిటిషన్ వేసుకుని బయటకు వచ్చారు. ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టిన బీఎస్పీ నేతలు, బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టును కోరనున్నట్టు తెలిపారు.

More Telugu News