: తొలి 'పసిడి'ని పట్టేసిన అమెరికా... తొలి రౌండ్ లోనే పేస్-బోపన్న ఓటమి, మొదటి రోజే ఇంటిదారి పట్టిన పలువురు భారతీయ ఆటగాళ్లు

రియో ఒలింపిక్స్ లో తొలి బంగారు పతకం అమెరికాకు లభించింది. తన నిలకడైన ఏకాగ్రతతో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్ ఆడిన యూఎస్ షూటర్ వర్జీనియా థ్రాషెర్ తొలి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ విభాగంలో థ్రాషెర్ 208 పాయింట్లు సాధించగా, చైనాకు చెందిన డూలీ (207 పాయింట్లు), మాజీ చాంపియన్ యి సిలింగ్ (185.4 పాయింట్లు)లు రజత, కాంస్య పతకాలు సాధించారు. కాగా, పురుషుల డబుల్స్ విభాగంలో పతకం సాధిస్తారన్న బలమైన నమ్మకమున్న లియాండర్ పేస్ - బొప్పన్న జోడి తొలి రౌండులోనే విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. భారత మహిళా షూటర్స్ అపూర్వి చెండీలా, అయోనికా పాల్ లు క్వాలిఫయింగ్ రౌండ్ లోనే వెనుదిరిగారు. చండీలా 34వ స్థానం, పాల్ 47వ స్థానంతో సరిపెట్టుకున్నారు. పురుషుల షూటింగ్ లో జితూరాయ్ ఎనిమిదో స్థానానికే పరిమితమయ్యాడు. రోయింగ్ పోటీల్లో భాగంగా సింగిల్స్ స్కల్స్ లో బాబన్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించాడు. మహిళల టేబుల్ టెన్నిస్ పోటీల్లో మౌమదాస్, మనికా బత్రా తొలి రౌండులోనే ఓడిపోయారు. పురుషుల టేబుల్ టెన్నిస్ లో ఆచంట శరత్ కమల్ కూడా తొలి రౌండులోనే ఇంటిదారి పట్టాడు.

More Telugu News