: నాలుగోసారి!.. మాల్యాకు మరో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!

17 బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగవేసి లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై మరో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 2012లో మాల్యాపై ఢిల్లీ మెట్రోపాటిన్ మేజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరుకాకుండా సతాయిస్తున్న మాల్యాపై ఆ కోర్టు ఇప్పటికే మూడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. తాజాగా నేటి ఉదయం జరిగిన విచారణకు కూడా మాల్యా హాజరుకాని నేపథ్యంలో న్యాయమూర్తి సుమీత్ ఆనంద్ మరో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్ తో ఇప్పటిదాకా ఈ కేసులో మాల్యాపై నాలుగు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్లైంది. విచారణను నవంబర్ 4కు వాయిదా వేసిన న్యాయమూర్తి ఆ విచారణకైనా మాల్యాను కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News