: విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావించి, రాజ్యసభ సభ్యులను ఆలోచింపజేసిన తృణమూల్ ఎంపీ!

పార్లమెంటులో, ముఖ్యంగా రాజ్యసభలో ప్రజా ప్రతినిధుల సుదీర్ఘ ఉపన్యాసాలు బోర్ కొట్టిస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ, అత్యంత కీలకమైన జీఎస్టీ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరీక్ ఓబ్రియన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావించి, మిగతా వారిని ఆలోచించేలా చేశారు. "సార్ నేను చిన్న కథతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఢిల్లీలో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడున్నాడు. ఈ జీఎస్టీ బిల్లు ఆలోచనను తొలిసారిగా చేసినప్పుడు పుట్టిన బాలుడు అతను. బిల్లు సభకు వచ్చిన 2005లో అతను పదో తరగతిలో ఉన్నాడు. ఇప్పుడు అతను దేశానికే వన్నెతెస్తూ, ఘనమైన విజయాలు సాధిస్తున్నాడు. అతని పేరు విరాట్ కోహ్లీ. మన దేశంలో అటువంటి విరాట్ కోహ్లీలు లక్షల మంది ఇప్పుడు మనవైపు, మన ప్రసంగాల వైపు చూస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం, రేపటి భారతావని కోసం మనం చర్చించాలి. జీఎస్టీ బిల్లును చట్ట రూపంలోకి తెచ్చి అమలు చేయాలి. ఎంత వేగంగా ఈ పని చేస్తే అంత మేలు కలుగుతుంది" అని అన్నారు. ఓబ్రియన్ ప్రసంగాన్ని మిగతా సభ్యులంతా ఆసక్తిగా విన్నారు.

More Telugu News