: లంచం తీసుకుంటే చేతులు నరికేయండి... గోవా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య!

గోవా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో సత్తా చాటేందుకు ఆప్ రంగంలోకి దిగింది. అవినీతి అంతం నినాదంతో రంగంలోకి దిగుతున్న ఆప్ కు పోటీగా... వివిధ పార్టీల నేతలు కూడా పలు నినాదాలు రంగంలోకి తీసుకొస్తున్నారు. ఈ నేపధ్యంలో...'ఎవరైనా లంచం తీసుకుంటే వారి చేతులు నరికేయండి' అని గోవాలోని బిచోలిం నియోజకవర్గ స్వతంత్ర్య ఎమ్మెల్యే నరేష్ సావ్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అవినీతి నిర్మూలన గురించి పట్టించుకోవడం మానేసిందని ఆయన ఆరోపించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ మాట్లాడుతూ, ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే కత్తిపట్టుకుని వచ్చేలా ఉన్నారని అన్నారు. బాధ్యతగల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా నేరానికి పాల్పడితే వారిని శిక్షించేందుకు చట్టాలున్నాయని అన్నారు. నిందితుడు దోషిగా నిర్ధారణ అయితే వారి పని చట్టం చూసుకుంటుందని ఆయన తెలిపారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.

More Telugu News