: ఎవరో మురుగదాసో, ఇంకో దాసో అంటారే తప్ప మనవాళ్ల పేర్లు చెప్పరేం?... హీరోలకు ఇగో పెరిగిపోయింది: దాసరి సంచలన కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమ భావదారిద్ర్యంలో మునిగిపోయిందని దర్శకరత్న దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'పెళ్లిచూపులు' చిత్రం సక్సెస్ మీట్ కు వచ్చిన ఆయన, ఏ హీరో పేరునూ చెప్పకుండానే వారిలో ఈగో పెరిగిపోయిందని అన్నారు. అభిమాన దర్శకులు ఎవరని ప్రశ్నిస్తే, ఇక్కడ ఉన్న రాజమౌళి, రాఘవేంద్రరావు, విశ్వనాథ్ ల పేర్లు చెప్పకుండా ఏ మురుగదాసో, ఇంకో దాసో అంటున్నారని, లేకుంటే హిందీవాళ్లు, ఇంగ్లీష్ వాళ్ల పేర్లు చెబుతున్నారని సెటైర్లు వేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎందరో గొప్పవాళ్లున్నా వారి పేర్లు చెప్పేందుకు మనసు రావడం లేదని, ఇది ఒక్క తెలుగు పరిశ్రమకు మాత్రమే చుట్టుకున్న జబ్బని అన్నారు. పెద్ద సినిమాలను వేల థియేటర్లలో విడుదల చేస్తున్న నిర్మాతలపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. చాలా మందికి పిచ్చి పట్టిందని, 500, 1000 థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తే, నాలుగో రోజుకు ఎవరు చూస్తారని పశ్నించారు. తెలుగు చిత్ర పరిశ్రమపై తనకు ఎంతో అసంతృప్తిగా ఉందని, ఇండస్ట్రీ చెడిపోయిందన్న అంచనాకు వచ్చేశానని తెలిపారు. పెళ్లిచూపులు వంటి మరిన్ని మంచి చిత్రాలు వస్తేనే తిరిగి తలెత్తుకు నిలుస్తుందని దాసరి అన్నారు.

More Telugu News