: జయలలిత నన్ను కొట్టారు!... రాజ్యసభలో అన్నాడీఎంకే బహిష్కృత నేత సంచలన ఆరోపణ!

రాజ్యసభ సమావేశాల్లో భాగంగా నిన్న అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏపీకి ప్రత్యేక హోదాపై ఓ వైపు పార్లమెంటు ఉభయసభలు అట్టుడికినా... శశికళ కన్నీళ్లు పెట్టుకుంటూ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ చెంప చెళ్లుమనిపించిన శశికళపై అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వేటు వేశారు. పార్టీ నుంచి ఆమెను జయ బహిష్కరించారు. ఈ విషయానికి సంబంధించి తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఘటనలను నిన్న శశికళ సభలో ఏకరువు పెట్టారు. తిరుచ్చి శివపై చేయి చేసుకున్న వైనంపై వివరణ ఇచ్చేందుకు తాను వెళ్లగా, ఉన్నపళంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని తనను జయలలిత ఆదేశించారని ఆమె చెప్పారు. దీనిపై తాను ఆలోచించుకునేలోగానే జయలలిత తనపై చేయి చేసుకున్నారని, అకారణంగా తనను కొట్టారని ఆమె సంచలన ఆరోపణ చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని జయ తనను బెదిరించారని కూడా శశికళ ఆరోపించారు.

More Telugu News