: కంప్లెయింట్ చేసేందుకొస్తే కాళ్లు పట్టింకుచున్న పోలీస్!... లక్నోలో హెడ్ కానిస్టేబుల్ పై వేటు!

ఉత్తరప్రదేశ్ లో పోలీసు దాష్టీకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట నిత్యం అత్యాచారాలు చోటుచేసుకుంటున్నా కిమ్మనకుండా కూర్చుంటున్న ఆ రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేసేందుకు కూడా ససేమిరా అంటున్నారు. మీడియా దృష్టికి వెళ్లాయని భావిస్తున్న ఘటనలపై మాత్రం కేసులు నమోదు చేస్తున్న యూపీ పోలీసులు మిగిలిన వాటిపై అసలు కన్నెత్తి చూడటం లేదు. ఈ క్రమంలో గత శుక్రవారం ఆ రాష్ట్రంలోని మోహన్ లాల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకున్న ఓ ఘటన దేశవ్యాప్తంగా పెను కలకలమే రేపింది. సదరు పోలీస్ స్టేషన్ హౌజ్ అఫీసర్ గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రామ్ యజ్ఞ యాదవ్ చేసిన నిర్వాకానికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది. ఓ సమస్యపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై రామ్ యజ్ఞ యాదవ్ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతడితో కాళ్లు పట్టించుకున్నాడు. చక్కగా కుర్చీలో కూర్చున్న యాదవ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన వ్యక్తితో కాళ్లు పట్టించుకున్నాడు. ఈ వ్యవహారాన్నంతా గుట్టుచప్పుడు కాకుండా వీడియోలో బంధించిన గుర్తు తెలియని వ్యక్తులు దానిని సోషల్ మీడియాలో పెట్టేశారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారగా బాధితుడితో కాళ్లు పట్టించుకున్న రామ్ యజ్ఞ యాదవ్ పై సస్పెన్షన్ వేటు పడింది.

More Telugu News