: కాబూల్‌లో విరుచుకుపడిన తాలిబన్లు.. విదేశీయుల గెస్ట్‌హౌస్‌పై ట్రక్‌బాంబుతో దాడి.. వందమంది మృతి!

ఆఫ్గనిస్థాన్ సోమవారం మరోమారు రక్తసిక్తమైంది. విదేశీయులు ఉంటున్న గెస్ట్‌హౌస్‌పై ఉగ్రవాదులు ట్రక్‌బాంబుతో దాడిచేశారు. ఈ ఘటనలో వందమంది వరకు మృతి చెందగా పలువురు గాయపడినట్టు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. 2003లో కాబూల్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఆ స్థాయిలో జరగడం ఇదే మొదటిసారి. అమెరికా నిర్వహణలో ఉన్న బగ్రాం ఎయిర్‌బేస్‌కు సమీపంలో ఓ హోటల్‌లోకి నార్త్‌గేట్ ద్వారా ట్రక్‌తో ప్రవేశించి పేల్చివేసినట్టు తెలుస్తోంది. ఈ బాంబుదాడితో కాబూల్ ఒక్కసారిగా వణికిపోయింది. ఘటన జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు ధ్వంసం కావడం దాడి తీవ్రతకు అద్దం పడుతోంది. దాడికి తామే బాధ్యులమని తాలిబన్ ప్రకటించింది. భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో నిండి ఉన్న ట్రక్‌తో హోటల్‌ను ఢీకొట్టినట్టు పేర్కొంది. ఈ ఘటనలో వందమంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించింది. అయితే ప్రాణనష్టంపై అధికారికంగా సమాచారం అందాల్సి ఉంది. ఘటనపై స్పందించేందుకు అధికారులు అందుబాటులోకి రాలేదు. జూలై 23, 2001లో కాబూల్ లో జరిగిన ‘ట్విన్‌బాంబ్’ దాడి తర్వాత మళ్లీ జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు భావిస్తున్నారు. అప్పటి ఘటనలో 80 మంది పౌరులు మృతిచెందారు.

More Telugu News