: ప్రొ కబడ్డీ విజేత పట్నా!... వరుసగా రెండోసారి టైటిల్ నెగ్గిన పైరేట్స్!

నెల రోజులకు పైగా సందడి చేసిన ప్రొ కబడ్డీ లీగ్ నిన్న రాత్రితో ముగిసింది. భాగ్యనగరి హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన లీగ్ ఫైనల్లో పింక్ పాంథర్స్ ను చిత్తు చేసిన పట్నా పైరేట్స్ టైటిల్ ను ఎగురవేసుకుపోయింది. వెరసి పట్నా పైరేట్స్ వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 37-29 పాయింట్ల తేడాతో పైరేట్స్ చేతిలో పాంథర్స్ చిత్తైంది. మ్యాచ్ ప్రారంభంలో సత్తా చాటిన పింక్ పాంథర్స్ చివరలో మాత్రం చేతులెత్తేసింది. సింగిల్ మ్యాచ్ లో ఏకంగా 16 పాయింట్లను సాధించిన పైరేట్స్ ఆటగాడు పర్దీప్ నర్వాల్ తన జట్టు గెలుపులో కీలక భూమిక పోషించాడు. పాంథర్స్ కెప్టెన్ జస్వీర్ సింగ్ ఒంటిచేత్తో 13 పాయింట్లు సాధించినా పైరేట్స్ దూకుడును అడ్డుకోలేకపోయాడు. మ్యాచ్ లో తొలి అర్ధభాగం ముగిసేసరికి పైరేట్స్ తో సరిసమానంగా 16 పాయింట్లు సాధించిన పాంథర్స్.... ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పైరేట్స్ ఆటగాళ్లు ఒక్కసారిగా జూలు విదిల్చారు. వెరసి పట్నా ప్రొ కబడ్డీలో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది.

More Telugu News