: వెస్టిండీస్‌తో రెండో టెస్ట్: 162 పరుగుల ఆధిక్యంలో భారత్.. సెంచరీతో కదం తొక్కిన రాహుల్

వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ కదం తొక్కాడు. 158 పరుగులు చేసి కెరీర్‌ బెస్ట్ నమోదు చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ప్రత్యర్థి కంటే 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం అజింక్యా రహానె(42), వృద్ధిమాన్ సాహా(17) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 126/1తో భారత్ ఇన్నింగ్స్ కొనసాగించింది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో రాహుల్-పుజారా ఓపిగ్గా బ్యాటింగ్ చేశారు. 56వ ఓవర్లో సిక్సర్‌తో వంద పరుగులు పూర్తిచేసిన రాహుల్ కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. లంచ్ తర్వాత పుజారా(46) రనౌట్ కావడంతో రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బరిలోకి దిగిన కోహ్లీతో కలిసి జాగ్రత్తగా ఆడిన లోకేశ్ లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. కోహ్లీ రాకతో వేగం పెంచిన రాహుల్(158) 96వ ఓవర్లో 277 పరుగుల వద్ద గాబ్రియల్ బౌలింగులో డౌరిచ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్(3) ఔటయ్యారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. విండీస్ కంటే 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు వెస్టిండీస్ 196 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో షానన్ గాబ్రియల్, దేవేంద్ర బిషూ చెరో వికెట్ పడగొట్టగా రోస్టన్ చేజ్ రెండు వికెట్లు నేలకూల్చాడు.

More Telugu News