: విండీస్ నిర్ణయం షాక్ కు గురి చేసింది: అశ్విన్

కింగ్ స్టన్ లో సబీనాపార్కులో రెండో టెస్టులో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ తీసుకోవాలని నిర్ణయించడం తనను ఆశ్చర్యపరిచిందని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ పతనాన్ని శాసించిన అశ్విన్ రెండో టెస్టులో కూడా సత్తాచాటాడు. పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తుందన్న పిచ్ పై టర్న్ తో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. దీంతో 52 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకుని సత్తాచాటాడు. కెప్టెన్ జాసన్ హోల్డర్ నిర్ణయం విండీస్ ను ఇబ్బందుల్లో పడేసిందని అశ్విన్ అన్నాడు. అందుకే కేవలం పది పరుగుల్లోపే ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయిందని పేర్కొన్నాడు. కాగా, తొలి రోజు వెస్టిండీస్ జట్టు 196 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంబించిన టీమిండియా ధావన్ (27) తొందరగా పెవిలియన్ చేరగా, కేఎల్ రాహుల్ (75), పుజారా (18) క్రీజులో ఉండడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది.

More Telugu News