: ప్రారంభమైన రెండో టెస్టు... విండీస్ మూడు వికెట్లు డౌన్!

టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా కింగ్ స్టన్ లో రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. క్రెయిగ్ బ్రాత్ వైట్ (1), రాజేంద్ర చంద్రిక (3) రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించారు. తొలి ఓవర్ ను ఇషాంత్ శర్మ వేసి రెండు పరుగులిచ్చాడు. తరువాత రెండో ఓవర్ ను మహ్మద్ షమీ వేసి ఒక రన్ ఇచ్చాడు. మూడో ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ మ్యాజిక్ చేశాడు. మూడో ఓవర్ నాలుగో బంతిని షార్ట్ పిచ్ గా సంధించగా, దానిని ఆడేందుకు ప్రయత్నించిన బ్రాత్ వైట్ షార్ట్ లెగ్ లో ఉన్న పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తరువాతి బంతికి డ్వెన్ బ్రావో (0) దిగాడు. ఇషాంత్ సంధించిన గుడ్ లెంగ్త్ బంతిని డిఫెన్స్ ఆడదామని ప్రయత్నించాడు. అయితే వికెట్లకు దూరంగా స్వింగ్ కావడంతో బంతి బ్యాట్ ను అలా ముద్దాడుతూ కోహ్లీ చేతుల్లో వాలిపోయింది. అనంతరం 6వ ఓవర్ తొలి బంతికి చంద్రిక (5)ను షమి అవుట్ చేశాడు. దీంతో ఏడు ఓవర్లలో 11 పరుగులు చేసిన వెస్టిండీస్ జట్టు కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ టెస్టు ద్వారా కుమ్మిన్స్ ని అంతర్జాతీయ క్రికెట్ కు విండీస్ జట్టు పరిచయం చేసింది. క్రీజులో బ్లాక్ వుడ్, శామ్యూల్స్ ఉన్నారు.

More Telugu News