: బెల్జియంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు రాకేశ్ మృతి
అనారోగ్యంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేశ్ సిద్ధరామయ్య (39) ఈరోజు మృతి చెందారు. బెల్జియంలోని బ్రస్సెల్స్లో చికిత్స పొందుతోన్న రాకేశ్ కొద్ది సేపటి క్రితం మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాకేశ్ శరీరంలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్లు వారు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం రాకేశ్ బెల్జియం టూర్కి వెళ్లారు. అయితే తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయనని బ్రస్సెల్స్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ప్యాంక్రియాసిస్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోన్న ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కుమారుడి అంశంపై విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్తో కూడా మాట్లాడారు. బ్రస్సెల్స్లో ఉన్న రాకేశ్కి ఉత్తమవైద్య సేవలు అందేలా భారత రాయబార కార్యాలయానికి సూచించాల్సిందిగా చెప్పారు. ఆమె వారికి ఫోన్ చేసి రాకేశ్కి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా చెప్పారు. తన కుమారుడి కోసం సిద్ధరామయ్య కూడా తమ ఫ్యామిలీ డాక్టర్స్ ఇద్దరిని బెల్జియంకి పంపించారు. రెండు రోజుల క్రితం ఆయన కూడా బెల్జియం వెళ్లారు. చికిత్స పొందుతూ రాకేశ్ ఈ రోజు మరణించారు.