: రాజ్యసభ రేపటికి వాయిదా... రేపు కూడా ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ!

రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై రాజ్యసభలో ఈ రోజు తీవ్ర చర్చ జరిగింది. చర్చలో పలువురు మాట్లాడాల్సి ఉండడంతో చర్చ ఇంకా ముగియలేదు. అలాగే సభానాయకుడు అరుణ్ జైట్లీ చర్చపై సమాధానం చెప్పేందుకు పెద్దపెద్ద పుస్తకాలు ముందేసుకుని సిద్ధంగా ఉన్నారు. దీంతో సభ ఇంకా ఈ రోజు సుదీర్ఘంగా జరగడం సరికాదని పేర్కొంటూ పలువురు సభ్యులు అభ్యంతరం చెప్పడంతో, దీనిపై రేపు చర్చిద్దామని పేర్కొంటూ సభను వాయిదా వేశారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభం కానుంది. సుమారు మూడున్నర గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలో దేశంలోని పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేయడం విశేషం. ఏ ఒక్క పార్టీ కూడా ఏపీకి ప్రత్యేకహోదా వద్దని చెప్పకపోవడం ఏపీపై దేశంలోని అన్ని పార్టీలకు సానుభూతి ఉందని తెలియజేస్తోంది. దీంతో మిగిలిన చర్చ రేపు కొనసాగనుంది.

More Telugu News