: ఐదు కోట్ల మంది ప్రజలకు జరిగిన అన్యాయంపై మాట్లాడుతున్నా...న్యాయం చేయండి: విజయసాయి రెడ్డి

'నా గొంతు చాలా ముఖ్యమైనది... నేను మాట్లాడేది నా మాటలు కాదు. 5 కోట్ల మంది ప్రజల గొంతు ఇది' అని వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించారన్నది, ఏపీకి అన్యాయం చేశారన్నది వాస్తవమని, దీనిని అందరూ అంగీకరించేదేనని అన్నారు. 'ఇది బడ్జెట్ బిల్లు కాబట్టి, దీనిని ఈ సభలో చర్చించేందుకు అనుమతి లేదని అంటున్నారు. అలాంటప్పుడు రాజ్యాంగంలోని 3, 4 సెక్షన్లపై రాష్ట్ర విభజన జరిగింది. ఇది బడ్జెట్ బిల్లు అయినప్పుడు దీనిని ఇక్కడ ఎలా ఆమోదించారు?' అని ఆయన నిలదీశారు. 'ఈ బిల్లును ఇక్కడే ఆమోదించారు కనుక ఇది బడ్జెట్ బిల్లు కాదన్న విషయం అందరూ అంగీకరించాల్సినదే'నని ఆయన తెలిపారు. రాజ్యసభలోకి వచ్చే 70 శాతం బిల్లులు మనీ బిల్లులేనని ఆయన స్పష్టం చేశారు. అలాంటప్పుడు రాజ్యసభలో ఏ బిల్లు కూడా చర్చించకూడదని, అలాంటప్పుడు అసలు రాజ్యసభ ఎందుకని ఆయన అడిగారు. లోక్ సభలో కనీసం ఈ బిల్లుపై చర్చ కూడా జరగలేదని ఆయన గుర్తు చేశారు. కేవలం రాజ్యసభలోనే చర్చ జరిగిందని... ఆ చర్చలో ఆరు హామీలు కేంద్రం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా ప్రత్యేకహోదా గురించి అప్పటి ప్రధాని ప్రత్యేకంగా ప్రకటన చేశారని ఆయన చెప్పారు. అప్పుడు వెంకయ్యనాయుడు ఏ కంపెనీ ప్రారంభించాలన్నా మూడేళ్ల సమయం పడుతుందని, కాబట్టి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, పదేళ్లు కావాలని అడిగారని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి సభ సాక్షిగా ఇచ్చిన హామీలకు విలువ లేకపోతే సభా గౌరవమర్యాదలు దెబ్బతింటాయని ఆయన అన్నారు.

More Telugu News