: అవన్నీ పుకార్లు... నేను బాలీవుడ్ ని విడిచిపెట్టలేదు: నర్గీస్ ఫక్రీ

బాలీవుడ్ ను విడిచి వెళ్లిపోయానన్న వార్తల్లో వాస్తవం లేదని సినీ నటి నర్గీస్ ఫక్రీ తెలిపింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన నర్గీస్ ఫక్రీ... నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రాతో ప్రేమలో పడింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో వివాహం చేసుకుందామని నర్గీస్ ఫక్రీ సూచించడంతో, ఇప్పుడే కాదని ఉదయ్ చోప్రా సమాధానమిచ్చాడు. దీంతో అతనిపై అలిగిన నర్గీస్ ఫక్రీ యూఎస్ వెళ్లిపోయిందని, ఇంకెప్పుడూ భారత్ కు రాదని బాలీవుడ్ లో వార్తలు వెల్లువెత్తాయి. వీటిపై స్పందించిన నర్గీస్ ఫక్రీ బాలీవుడ్ ను వీడాలన్న ఆలోచన లేదని చెప్పింది. యూఎస్ లో నా పనిని ముగించుకుని త్వరలోనే స్వస్థలం ఢిల్లీకి వచ్చి, 'బంజో' ప్రమోషన్స్‌ లో పాల్గొంటానని పుకార్లకు పుల్ స్టాప్ పెట్టింది.

More Telugu News