: పొరుగు రాష్ట్రాలకు తమిళ తంబీల పరుగులు!... ‘కబాలి’ చూసేందుకేనట!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’... తమిళ తంబీలను పొరుగు రాష్ట్రాల వైపు పరుగులు పెట్టిస్తోంది. నేటి ఉదయం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తమిళనాడు రాజధాని చెన్నైలోని 125కు పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన బెనిఫిట్ షోలను చూస్తున్న అభిమానులు మరో దఫా చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే చిత్రం చూసేందుకు తరలివస్తున్న రజనీ అభిమానులకు ఆయా థియేటర్ల వద్ద ‘హౌస్ ఫుల్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏదేమైనా ‘తలైవా’ చిత్రాన్ని తొలిరోజే చూడాలన్న భావనతో పలువురు తమిళులు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలకు తరలి వెళుతున్నారు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లోని తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో తమిళ తంబీల సందడి కనిపిస్తోంది. బెంగళూరు, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాలకు తమిళ తంబీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

More Telugu News