: సైక్లిస్టుల ర్యాలీకి పొరపాటున అడ్డుపడిన పాదచారి... కుప్పలా పడిపోయిన సైక్లిస్టులు

చైనాలో ప్ర‌తీ ఏడాది నిర్వహించే 'ది టూర్ ఆఫ్ క్వింజాయ్ సైక్లింగ్' పోటీ క్వింజాయ్ ప్రాంతంలోని కెన్సింగ్ సిటీలో ఈనెల 17న‌ ఘ‌నంగా ప్రారంభ‌మ‌యింది. ప్రపంచం నలుమూలల నుంచి వ‌చ్చిన సైక్లిస్టులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. సైక్లిస్టులు 3,630 కిలోమీటర్ల దూరాన్ని 15 రోజుల కాల వ్య‌వ‌ధితో చేరుకోవాలి. కెన్సింగ్ సిటీలో సైక్లిస్టుల‌ ర్యాలీ కోసం ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అయితే, సైక్లిస్టులు ఓ జంక్షన్ వద్దకు చేరుకుంటోన్న స‌మ‌యంలో ఓ పాదచారి పొర‌పాటున వారికి అడ్డంగా వ‌చ్చేశాడు. సైక్లిస్టుల‌ను గ‌మ‌నించ‌కుండా రోడ్డు దాటుతూ ఉన్నాడు. సైక్లిస్టుల్లో ముందుగా వ‌స్తోన్న వారు ఆ పాద‌చారిని ఢీ కొట్టారు. దీంతో వారి వెన‌క‌వ‌స్తోన్న సైక్లిస్టులు ముందుగా వెళుతోన్న సైక్లిస్టుల‌ని ఢీ కొట్టారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు సైకిళ్లతో స‌హా కింద‌ప‌డి పోయి సైక్లిస్టులు ఓ కుప్పలా క‌నిపించారు. ప‌దిహేను మంది సైక్లిస్టుల‌కి తీవ్ర‌గాయాల‌య్యాయి. వారు పోటీ నుంచి త‌ప్పుకున్నారు. ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన పాద‌చారిని పోలీసులు అరెస్టు చేశారు. తాను సైక్లిస్టుల‌ని గ‌మ‌నించ‌లేద‌ని స‌ద‌రు పాద‌చారి పోలీసుల‌కి తెలిపాడు.

More Telugu News