: బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్ తో పోరాటానికి సిద్ధం: విజేందర్ సింగ్

పాకిస్థాన్ సంతతికి చెందిన బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్ తో భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. అప్రతిహతంగా ఏడు బౌట్లు గెలిచిన విజేందర్ సింగ్ శనివారం ఆస్ట్రేలియా బాక్సర్ హోప్ పై విజయం సాధించి, ఆ విజయం బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీకి అంకితమిచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల రోజులు విశ్రాంతి తీసుకుంటానని అన్నాడు. హోప్ పై విజయం తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని చెప్పాడు. తాజా విజయంతో టాప్ 15లో ఉన్న తాను ఇకపై మరిన్ని కఠినమైన బౌట్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఇందుకోసం తాను కూడా సిద్ధంగానే ఉన్నానని చెప్పాడు. తన టీమ్ తో ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పిన విజేందర్, తొలిసారిగా ఫలానా బాక్సర్ తో పోటీ పడాలని ఉందని చెప్పాడు. అది కూడా పాకిస్థాన్ జాతీయుడైన బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్ తో తలపడాలని ఉందని తెలిపాడు. అందుకు అమీర్ ఖాన్ బరువు పెరగాలి, లేదా తాను బరువు తగ్గాలి, దీంతో ఇప్పట్లో అతనితో బౌట్ లో తలపడే అవకాశం లేదని విజేందర్ అన్నాడు. అయితే తాను మాత్రం అతనితో బౌట్ జరగాలని కోరుకుంటున్నానని, అది కూడా భారత్ లోనే జరగాలని కోరుకుంటున్నానని విజేందర్ ఆకాంక్షించాడు. పాకిస్థాన్ దేశీయుడితో జరిగే ఏ పోటీనైనా భారతీయులు అమితాసక్తితో చూస్తారన్న విషయం తెలిసిందే.

More Telugu News