: అత్యంత విలాసవంతమైన విందు... కేవలం 13.4 కోట్ల రూపాయలు మాత్రమే!

ప్రపంచంలో లగ్జరీ హోటళ్లు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఆయా సౌకర్యాలను బట్టి రుసుము వసూలు చేస్తుంటారు. అలాగే సింగపూర్ లోని మెరీనా బే సాండ్స్ లో ఉన్న 'సీ లా వా' హోటల్ కూడా ప్రత్యేకమైనది. ఈ హోటల్ వారు 'రష్యన్స్ వరల్డ్ ఆఫ్ డైమండ్స్'తో కలిసి సరికొత్త 'కపుల్ ప్యాకేజీ' విందు భోజనాన్ని అత్యంత సంపన్నులకు అందిస్తున్నారు. ఈ విందుకు కేవలం ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. ఈ విందు స్పెషాలిటీ ఏంటంటే... విందుకు వచ్చిన తరువాత తొలి 45 నిమిషాలు హెలికాప్టర్ లో వీరికి సింగపూర్ అందాలను చూపిస్తారు. ఆ తరువాత రోల్స్ రాయిస్ కారులో ఆ జంటను మేరీనా బే సాండ్స్ లోని 'సీ లా వా' హోటల్ కు తీసుకుని వస్తారు. హోటల్ నుంచి సింగపూర్ అందాల్ని ఆస్వాదించేలా బాల్కనీలో విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఈ విందులో అత్యంత సంపన్నులు మాత్రమే తినే భోజనాన్ని సర్వ్ చేస్తారు. ఈ భోజనంతో పాటు 40 ఏళ్ల పురాతన మద్యాన్ని సరఫరా చేస్తారు. విందు ముగిసిన అనంతరం ఈ విందును గుండెల్లో చిరకాలం పదిలం చేసుకునేలా 2.08 క్యారట్‌ ఫ్యాన్సీ వివిద్‌ బ్లూ జానె సెమూర్‌ డైమండ్ రింగ్స్ ఇస్తారు. ఈ ఉంగరాలు ప్రపంచంలోనే అరుదైన వజ్రాలతో చేసినట్టు హోటల్ చెబుతోంది. దీంతో అత్యంత విలాసవంతమైన విందు ముగుస్తుంది. ఇంతకీ ఈ విందు భోజనం ఖరీదు ఎంతంటే... జస్ట్ 13.4 కోట్లు!

More Telugu News