: ధోనీని మోసం చేసిన ఆస్ట్రేలియా కంపెనీపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న రితి స్పోర్ట్స్

టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఆస్ట్రేలియా కంపెనీ మోసం చేసిందని అతని స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ రితి స్పోర్ట్స్ తెలిపింది. ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్టింగ్ కంపెనీ స్పార్టాన్ ధోనికి రావాల్సిన 13 కోట్ల రూపాయలను ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తోందని రితి స్పోర్ట్స్ ఆరోపించింది. స్పార్టాన్ తో ధోనీ 2013 లో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం స్పార్టాన్ సంస్థ 2016 మార్చిలో చివరిసారి ఒక వాయిదా చెల్లించిందని రితి స్పోర్ట్స్ వ్యవహారాలను చూసే అరుణ్ పాండే తెలిపారు. దీనిపై కాల్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదని, మెసేజ్ పెట్టినా స్పార్టాన్ మేనేజ్ మెంట్ స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పార్టాన్ పై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. ఈ కంపెనీపై సిడ్నీలో, ఢిల్లీలో కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

More Telugu News