: ‘చెర్రీ’ ఫ్లైట్స్ కు ఏడాది పూర్తి!... ‘కనెక్టింగ్ ఇండియా ఆఫర్’ను ప్రకటించిన ట్రూజెట్!

టాలీవుడ్ యంగ్ హీరో రాంచరణ్ తేజ భాగస్వామిగా పౌర విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన ‘ట్రూజెట్ ఎయిర్ వేస్’ సంస్థకు నిన్నటితో ఏడాది పూర్తైంది. ఈ క్రమంలో నేడు తొలి వార్షికోత్సవ వేడుకలను ఆ సంస్థ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ‘కనెక్టింగ్ ఇండియా ఆఫర్’ పేరిట ఆ సంస్థ కొత్త ప్రమోషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. గతేడాది జూలై 12న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చెర్రీ ఫ్లైట్స్ ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత రెండు మార్గాల్లోనే విమానాలను నడిపిన ట్రూజెట్... ప్రస్తుతం 5 మార్గాల్లో విమానాలను నడుపుతోంది. విజయవాడ-కడప-విజయవాడ, చెన్నై-కడప-చెన్నై, హైదరాబాదు-కడప- హైదరాబాదు, కడప-తిరుపతి, హైదరాబాదు-ఔరంగాబాదు మార్గాల్లో ప్రస్తుతం ట్రూజెట్ విమానాలు సేవలందిస్తున్నాయి. తొలి వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రారంభించిన ‘కనెక్టింగ్ ఇండియా ఆఫర్’ ద్వారా... ట్రూజెట్, లేదా ఏదేనీ ఇతర ఎయిర్ లైన్స్ లో అదే రోజు ప్రయాణించిన ప్రయాణికులకు రూ.500 విలువ కలిగిన వోచర్ ను ఆ సంస్థ అందించనున్నట్లు ప్రకటించింది. తాను సేవలందిస్తున్న ప్రాంతాలతో దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

More Telugu News