: ఎఫ్ఐఐలు అమ్మేశారు... వరుస లాభాల తరువాత నష్టపోయిన స్టాక్ మార్కెట్

బ్రెగ్జిట్ ఫలితాలు మార్కెట్ ను కుదేలు చేసిన తరువాత నిలదొక్కుకున్న సెన్సెక్స్, నిఫ్టీలకు తొలిసారిగా లాభాల స్వీకరణ ఎదురైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్దఎత్తున ఈక్విటీల విక్రయానికి దిగడంతో వరుస లాభాల తరువాత భారత స్టాక్ మార్కెట్ నష్టపోయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లతో పోలిస్తే, దిగ్గజ కంపెనీల వాటాలు అధిక ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపు వద్దే కదలాడిన సూచికలు, ఆపై క్రమంగా నష్టాన్ని పెంచుకుంటూ సాగాయి. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 111.89 పాయింట్లు పడిపోయి 0.41 శాతం నష్టంతో 27,166.87 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 34.75 పాయింట్లు పడిపోయి 0.42 శాతం నష్టంతో 8,335.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.08 శాతం, స్మాల్ కాప్ 0.11 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 15 కంపెనీలు లాభపడ్డాయి. అరవిందో ఫార్మా, కోల్ ఇండియా, యస్ బ్యాంక్, బోష్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, గెయిల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,893 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,281 కంపెనీలు లాభాలను, 1,474 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. సోమవారం నాడు బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,04,31,071 కోట్లుగా ఉండగా, అది రూ. 1,04,12,224 కోట్లకు తగ్గింది.

More Telugu News