: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పై పరువు నష్టం దావా వేసిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ శామ్యూల్స్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జెఫ్ లాసన్ పై వెస్టిండీస్ ఆల్ రౌండర్ మార్లోన్ శామ్యూల్స్ పరువు నష్టం దావా వేశాడు. వెస్టిండీస్ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ఏప్రిల్ 4న 'బిగ్ స్పోర్ట్స్ బ్రేక్ ఫాస్ట్' రేడియో కార్యక్రమంలో లాసన్ మాట్లాడుతూ, 'వెస్టిండీస్ లోని మాఫియా వ్యక్తులతో శామ్యూల్స్ కు సంబంధాలున్నాయి. అతడి వెనుక ఎవరున్నారో మీకు తెలియదు. ప్రపంచంలోని హత్యల రాజధానిగా పేరు పొందిన వాటిలో ఒకటైన జమైకాలోని కింగ్ స్టన్ నుంచి అతడు వచ్చాడు. అక్కడి హంతక ముఠాలతో అతడికి సంబంధాలున్నాయ'ని ఆరోపణలు చేశాడు. దీనికి స్పందించిన శామ్యూల్స్... లాసన్ వ్యాఖ్యలు తనను అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ పరువు నష్టం దావా వేశాడు. లాసన్ కామెంట్స్ న్యాయవిరుద్ధంగా ఉండడమే కాకుండా, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. జర్నలిస్ట్ జేమ్స్ మాథహె పేరు కూడా ఈ దావాలో చేర్చడం విశేషం. కాగా, విండీస్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో శామ్యూల్స్ పాత్ర ప్రధానమైనదన్న సంగతి అందరికీ తెలిసిందే.

More Telugu News