: లాభాల స్వీకరణలోనూ పరుగాపని మార్కెట్ బుల్!

మార్కెట్ లాభాలు కొనసాగాయి. సెషన్ ఆరంభంలోనే భారీ లాభాలను సూచికలు నమోదు చేయగా, ఆపై మధ్యాహ్నం తరువాత లాభాల స్వీకరణ తెరపైకి వచ్చినప్పటికీ, మార్కెట్ బుల్ పరుగు ఆగలేదు. ఒక దశలో 200 పాయింట్లకు పైగా లాభాల్లో నిలిచిన సెన్సెక్స్ చివరికి 133 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసింది. యూరప్ మార్కెట్ల సరళి ఇన్వెస్టర్లను అమ్మకాల దిశగా నడిపించిందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 133.85 పాయింట్లు పెరిగి 0.49 శాతం లాభంతో 27,278.76 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 42.35 పాయింట్లు పెరిగి 0.51 శాతం లాభంతో 8,370.70 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.58 శాతం, స్మాల్ కాప్ 0.53 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 32 కంపెనీలు లాభపడ్డాయి. బీహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఐటీసీ, బోష్ లిమిటెడ్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,885 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,717 కంపెనీలు లాభాలను, 1,024 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,04,31,071 కోట్లకు పెరిగింది.

More Telugu News