: కుంబ్లే ఎంపిక కూడా ‘పరస్పర ప్రయోజన’ ఫలితమేనా?.. కోచ్ కంపెనీలో వీవీఎస్ కు వాటా!

టీమిండియా హెడ్ కోచ్ పదవి దక్కలేదన్న అక్కసుతో కోచ్ ఎంపికలో కీలక భూమిక పోషించిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీపై జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. సదరు వ్యాఖ్యలకు గంగూలీ కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ గా అనిల్ కుంబ్లే ఎంపిక తీరుపైనా విమర్శలు రేగుతున్నాయి. ఇటీవల జరిగిన కోచ్ ఎంపికలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సదరు కమిటీలో గంగూలీతో పాటు సచిన్ టెండూల్కర్, హైదరాబాదీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఈ కమిటీ సూచన మేరకే బీసీసీఐ కుంబ్లేను కోచ్ గా ఎంపిక చేసింది. అయితే ఎంపిక సందర్భంగా ‘పరస్పర ప్రయోజనం’ ప్రభావాన్ని చూపిందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘డీఎన్ఏ’ ఓ సంచలన కథనాన్ని రాసింది. ఈ కథనం ప్రకారం.... క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత 2011లో అనిల్ కుంబ్లే ‘టెన్విక్ స్పోర్ట్స్’ పేరిట ఓ కంపెనీని పెట్టాడు. టెన్నిస్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ లతో కలిసి కుంబ్లే ప్రారంభించిన ఈ కంపెనీలో వీవీఎస్ లక్ష్మణ్ 2012లో 16,666 ఈక్విటీ షేర్లను కొన్నాడు. సదరు షేర్లు ఈ ఏడాది ప్రారంభం నాటికి రెట్టింపయ్యాయి. ప్రస్తుతం టెన్వీ స్పోర్ట్స్ లో లక్ష్మణ్ కు 33,332 షేర్లున్నాయి. తాను పెట్టుబడి పెట్టిన కంపెనీకి అధినేతగా ఉన్నందునే లక్ష్మణ్ కోచ్ పదవికి కుంబ్లేను ఎంపిక చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్ కు వాటాలున్న సంగతి సచిన్, గంగూలీలకు తెలసో? లేదో? అని ఆ కథనం పేర్కొంది.

More Telugu News