: 50 లక్షల ఉత్పత్తులను తక్కువ ధరలకు ఇవ్వనున్న అలీబాబా!

చైనా నుంచి తక్కువ ధరలకు 50 లక్షలకు పైగా ప్రొడక్టులను ఇండియాకు అందించాలని నిర్ణయించామని, ఇందుకోసం అక్కడి ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సహకారం తీసుకోనున్నామని పేటీఎం వెల్లడించింది. ఇందుకోసం ఆ సంస్థతో డీల్ కుదుర్చుకున్నట్టు పేటీఎం ఉన్నతాధికారి భూషణ్ పాటిల్ వెల్లడించారు. ఇండియాలో కిచన్, యూఎస్బీ కుక్కర్స్, ఫ్యాషన్, మొబైల్ యాక్సెసరీస్ తదితర రంగాల్లో మంచి ట్రాక్ రికార్డున్న భారత వ్యాపారస్తులను 30 మంది వరకూ గుర్తించామని ఆయన తెలిపారు. వీరందరి వ్యాపారాన్నీ మరింత ఉన్నతికి తీసుకువెళ్లేందుకు సహకరిస్తామని తెలిపారు. చైనాలో నూతన వస్తు ఉత్పత్తుల తయారీరంగం ఆకర్షణీయంగా ఉందని పాటిల్ వెల్లడించారు. బిజినెస్ టు కస్టమర్స్ వ్యాపారంపై తాము దృష్టిని సారించామని తెలిపారు. పేటీఎంతో డీల్ కుదుర్చుకుని వస్తువులను విక్రయిస్తున్న వ్యాపారులు, ఇతర ఈ-కామర్స్ ప్లాట్ ఫాంలను సైతం వాడుకోవచ్చని, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, అమేజాన్ తదితర కంపెనీలు మాధ్యమంగానూ వ్యాపారం సాగించుకోవచ్చని తెలిపారు. వ్యాపారులకు మూలధనం నిధులు అవసరమైతే ఆదుకునేందుకు తాము సిద్ధమేనని పాటిల్ తెలియజేశారు.

More Telugu News