: హృదయం ద్రవించిందంటూ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ కు వీడ్కోలు పలికిన లియోనెల్ మెస్సీ

'కోపా అమెరికా' కప్ ఫైనల్స్ లో చిలీ చేతిలో ఓడిపోయిన అనంతరం స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపాడు. న్యూజర్సీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మెస్సీ, పెనాల్టీని గోల్ గా మలచడంలో విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై తన హృదయం ద్రవించిందని వ్యాఖ్యానించిన ఆయన, అర్జెంటీనా జాతీయ జట్టుతో తన బంధం తెగిపోయినట్టేనని, అది తన తుది నిర్ణయమని చెమర్చిన కళ్లతో వ్యాఖ్యానించాడు. సీనియర్ అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు 2005 నుంచి ఆడుతున్న ఆయన, అర్జెంటీనా తరఫున 55 గోల్స్ చేసి ఆల్ టైం టాప్ స్కోరర్ గా ఉన్నాడు. కోపా ఫైనల్ మెస్సీకి 113వ అంతర్జాతీయ ఫుట్ బాల్ గేమ్. కోపా అమెరికా ఫైనల్ పోటీల్లో రెండు వరుస సంవత్సరాల్లో అర్జెంటీనా, చిలీలు తలపడగా, రెండుసార్లూ పెనాల్టీ షూటౌట్ జరిగింది. రెండింటిలో చిలీ విజయం సాధించింది.

More Telugu News