: హిల్లరీ క్లింటన్ కు లంచాలిచ్చిన భారత రాజకీయ నేతలు: ట్రంప్

రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, తన ప్రత్యర్థి డెమోక్రాట్ నేత హిల్లరీ క్లింటన్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆమెకు భారత రాజకీయ నేతలు, పలు కంపెనీల నుంచి ముడుపులు అందాయని ఆరోపించారు. ఇండో - యూఎస్ పౌర అణు ఒప్పందానికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమెకు లంచాలు ఇచ్చారని అన్నారు. మొత్తం 35 పేజీలకు పైగా ఉన్న తన ప్రచార పుస్తకాన్ని ఆయన విడుదల చేయగా, అందులో హిల్లరీపై పలు ఆరోపణలు చేశారు. భారత రాజకీయ నేత అమర్ సింగ్ నుంచి ఆమె భారీ మొత్తంలో డబ్బు అందుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్ 2008లో ప్రచురించిన వార్తను ట్రంప్ ప్రస్తావించారు. ఈ డబ్బు క్లింటన్ ఫౌండేషన్ కు వచ్చిందని, అణు పరిజ్ఞానం తమకు కావాలని కోరుతూ అమర్ సింగ్ యూఎస్ లో పర్యటించారని, ముడుపులు అందుకున్న ఆమె, డీల్ కు వ్యతిరేకంగా వ్యవహరించబోనని హామీ ఇచ్చారని తెలిపారు. కాగా, ఈ ఆరోపణలు గతంలోనే రాగా, హిల్లరీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News