: ఆర్బీఐ గవర్నర్ చాన్స్ రాకేష్ మోహన్ కు... జూలైలో ప్రకటన!

ప్రస్తుతం ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్)లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్న ఆర్థికవేత్త రాకేశ్ మోహన్ కు తదుపరి ఆర్బీఐ గవర్నర్ పదవి దక్కవచ్చని తెలుస్తోంది. ఆయన నియామకం దాదాపుగా ఖరారైనట్టేనని, వచ్చే నెలలో అధికారికంగా ప్రకటన వెలువడవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత గవర్నర్ రఘురాం రాజన్ సైతం ఐఎంఎఫ్ లో విధులు నిర్వహిస్తూ, ఆర్బీఐకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, యూనివర్శిటీ ఆఫ్ లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్, యేల్ యూనివర్శిటీ వంటి అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించిన ఆయన, 2002 నుంచి 2009 మధ్య ఆర్బీఐ డిప్యూటీ గవర్నరుగా పనిచేశారు. 2001 ప్రాంతంలో చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ గా కూడా పనిచేశారు. ఇక పార్లమెంటు సమావేశాలు మొదలయ్యేలోపే గవర్నర్ ఎవరన్న విషయమై కేంద్రం ప్రకటన చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

More Telugu News